కర్మ ఎలా ఉంటుంది ?


శ్రీ కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు .

దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా. నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి 14 సంవత్సరాలు ఆగావు ' అని అడిగింది.

అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు 'అమ్మా! నన్ను క్షమించు. గత జన్మలో నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు ?' అన్నాడు చిరునవ్వు తో

దేవకి ఆశ్చర్య చకితురాలయింది 'కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?' అని అడిగింది.

కృష్ణుడు అన్నాడు, 'అమ్మా! గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి. నీ భర్త దశరథుడు.'

దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది 'అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో? అని

కృష్ణుడు ఇలా అన్నాడు,'ఇంకెవరు? యశోద మాత! గత జన్మలో 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు . అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది.'

ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైనా వాటి నుంచి తప్పించుకోలేరు.

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు